యూరియా కొరతను తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి
కడప అగ్రికల్చర్ : యూరియా కొరత తీర్చి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి బుక్కే చంద్రనాయక్లను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 1,07,013 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. సాగుకు అనుగుణంగా ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 16 వేల మెట్రిట్ టన్నుల యూరియా మాత్రం జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. పూర్తి స్థాయిలో యూరియాను జిల్లాకు కేటాయించాలన్నారు. ఎమ్మార్పీ ధరలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, ఖాజీపేట మండల యువత అధ్యక్షుడు ముత్తూరు రమణ, చెముళ్ళపల్లె సర్పంచ్ ములపాకు బుజ్జి, ఏటూరు మాజీ సర్పంచ్ ఏనుగు గోపాల్ రెడ్డి, నేతలు మల్లెం వెంకటరామిరెడ్డి, పాలగిరి వెంకటసుబ్బారెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, రామా శివప్రసాద్ రెడ్డి, చాగం రెడ్డి మహేశ్వర రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.


