దొంగల ముఠా అరెస్ట్
● రూ.36 లక్షల సొత్తు స్వాధీనం
● జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన కిరాణాదుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దుద్దే రమేష్ శెట్టి ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో దొంగల ముఠాను ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.36 లక్షల విలువచేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.60 వేలు విలువైన ఐ–ఫోన్, మూడు సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించిన కట్టింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో మంగళవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరం, అరెస్ట్, రికవరీ వివరాలను ఎస్పీ తెలియజేశారు. గత సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ న దుద్దే రమేష్ శెట్టి ఇంటిలో దుండగులు అక్రమంగా ప్రవేశించి బీరువా లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగలించారు. ఈ కేసులో ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన యెట్టి విజయ్పాల్, షేక్ గైబువల్లి అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చదువు మానేసి, చెడు వ్యసనాలకు బానిసై జులాయి గా తిరుగుతూ జన సంచారం తక్కువ ఉన్న ప్రాంతాలలో కొంత కాలంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నారు. నిందితులు ముందస్తు పథకంలో భాగంగా కుట్ర పన్ని గత కొద్ది రోజులుగా నాలుగు రోడ్ల కూడలిలో కిరాణా దుకాణం నడుపుకుంటున్న దుద్దే రమేష్ శెట్టి, కుటుంబ సభ్యుల కదలికలు, ఇంటిని గమనించారు. రమేష్ శెట్టి అంగడి వద్ద ఉండగా డిసెంబర్ 21న రాత్రి 7 నుండి 7.30 గంటల సమయంలో ఇంటి తలుపు గడియను కట్టింగ్ మిషేన్తో కట్ చేశారు. ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లాలో చోరీల నివారణకు కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.


