
ఘనంగా చందనాజ్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
ప్రొద్దుటూరు : పట్టణంలోని గాంధీ రోడ్డులో నూతనంగా చందనా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందనాజ్ జ్యువెలరీ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ తమ షోరూంలో లైఫ్ టైం వారంటీతో హాల్ మార్క్ బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక గ్రాము గోల్డ్ కొన్న వారికి రెండు గ్రాముల వెండిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈనెల 25వ తేదీ వరకు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదుపు తప్పి లారీ బోల్తా
ముద్దనూరు : ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో యామవరం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడింది. తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న లారీ వేగం అదుపు తప్పడంతో రహదారి పక్కన బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
సైన్స్ ఒలంపియాడ్లో
భారతి డీఏవీ విద్యార్థుల ప్రతిభ
కమలాపురం : సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీల్లో డీఏవీ భారతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) భారతి డీఏవీ పాఠశాలలో బుధవారం సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీలు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పోటీల్లో జోనల్ స్థాయిలో 41 మంది బంగారు పతకాలు సాధించారు. అలాగే 6 మంది రజత పతకం, 8 మంది వెండి పతకాలు సాధించారని ఆయన తెలిపారు. కాగా హెచ్ఆర్ హెడ్ గోపాల్ రెడ్డి, డీఏవీ రీజనల్ ఆఫీసర్ శేషాద్రి ఒలంపియాడ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మూలపల్లెలో చిరుతల సంచారం
సిద్దవటం : మండలంలోని మూలపల్లె గ్రామ సమీపంలో చిరుత పులులు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప రేంజి పరిధిలోని కనుమలోపల్లె బీటులో చిరుత పులి, చిరుత కూనలు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు, చుట్టు పక్కల పొలాల రైతులకు కంటినిండా నిద్ర లేకుండా పోయింది. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన రాజశేఖర్యాదవ్ అనే వ్యక్తి తన మేక కనిపించకపోవడంతో గాలింపు చేపట్టగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో మేక మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. మంగళవారం రాత్రి చిరుత పులి, రెండు చిరుత కూనలు మూలపల్లె– సిద్దవటం రోడ్డులో సంచరిస్తూ గ్రామ సమీపంలోని పొట్టేటి పద్మావతమ్మ మామిడి తోటలోకి వెళుతుండగా మాచుపల్లె నుంచి బొలెరోలో వస్తున్న హెచ్పీసీఎల్ గ్యాస్ కంపెనీ లైన్ వాకర్లు బి. యల్లయ్య, విష్ణులకు కనిపించాయి. దీంతో వారు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న కడప రేంజర్ ప్రసాద్ సిబ్బందితో కలిసి చిరుత పాద ముద్రలను గుర్తించేందుకు చిరుత పులి సంచరించిన ప్రాంతాల్లో పరిశీంచారు.

ఘనంగా చందనాజ్ జ్యువెలరీ షోరూం ప్రారంభం