దళారులను నమ్మొద్దు
సాక్షి, యాదాద్రి : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దళారుల పైరవీలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్థానిక నాయకులు అమాయక అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పోస్టుకో రేటు నిర్ణయించి దండుకుంటున్నారు.
నాలుగు ప్రాజెక్టుల పరిధిలో..
ఆలేరు, భువనగిరి, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ ఆయా పోస్టులకు రూ. 50వేలు, టీచర్ పోస్టులకు రూ. లక్ష వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు తాము అత్యంత సన్నిహితులం అని నమ్మబలుకుతూ అడ్వాన్సులు సైతం తీసుకుంటున్నారు. మోత్కూరు, గుండాల, ఆలేరు, వలిగొండ, రాజాపేట తదితర మండలాల్లో ఈ వ్యవహారం నడుస్తోంది.
దళారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఇటీవల గ్రామ పంచాయతీల్లో అధికారులు ప్రాథమికంగా అర్హుల జాబితాను ప్రదర్శించడంతో ఈ దందా బయటపడింది. స్థానికత లేకపోవడం, వయోపరిమితి వంటి కారణాలతో స్క్రూటినీలో పలువురి పేర్లను తొలగించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని దళారుల చుట్టూ తిరుగుతున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన
ఆన్లైన్లో అందిన ధ్రువపత్రాల ప్రాథమిక పరిశీలన ముగిసింది. అభ్యర్థి వాస్తవంగా ఆ గ్రామంలోనే నివసిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు సీడీపీఓల ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతోంది. లోకల్,నాన్–లోకల్ జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు వారం రోజుల సమయం ఇస్తారు.
10 శాతం వెయిటేజీ
అభ్యర్థి నియామక ప్రక్రియలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. 90 మార్కులు అభ్యర్థి అర్హతలు, కేటగిరీ ఆధారంగా సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. ఇందులో వితంతువులకు 5, వికలాంగులకు 5, అనాఽథలకు 10, మార్కులు కేటాయిస్తారు. ఇందులో ఇంటర్వ్యూలో 10మార్కులు కలుపుతారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీ (డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓ, డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరుగుతుంది
సెప్టెంబర్ రెండో వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. కేవలం మెరిట్ ఆధారంగానే పారదర్శకంగా ఎంపిక ఉంటుంది. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. దళారులపై పోలీస్ కేసులు నమోదు చేస్తాం.
– చిలుకూరు శ్రీనివాసరావు,
జిల్లా సంక్షేమాధికారి
అంగట్లో అంగన్వాడీ కొలువులు
ఫ అధికార పార్టీ నేతల పేరుతో
అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు
ఫ ప్రాథమిక జాబితాల ప్రకటనతో వెలుగుచూసిన అక్రమాలు
ఫ అర్హత, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తామంటున్న అధికారులు


