సాక్షి యాదాద్రి: జిల్లాలోని బి.ఎన్. తిమ్మాపురం (బస్వాపురం), గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయినవారితో పాటు హైలెవల్ కెనాల్ కోసం రూ.171కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో బస్వాపురం, వడపర్తి, బి.ఎన్. తిమ్మాపురం పరిధిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయిన వారి కోసం రూ. 75 కోట్లు మంజూరు చేసింది గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూ బాధితుల కోసం రూ. 87 కోట్లు విడుదలయ్యాయి (గతంలో పరిహారం కింద రూ. 27 కోట్లు అందించిన విషయం తెలిసిందే). అలాగే భువనగిరి నుంచి బీబీనగర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన హై లెవల్ మెయిన్ కెనాల్ పనుల కోసం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి.
క్రీడలతో క్రమశిక్షణ
భువనగిరి: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి కె. ధనుంజనేయులు అన్నారు. శనివారం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మేజర్ ద్యాన్ చంద్ను నేటితరం యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది జానకిరాము, మురళి, జయ, రేణుక, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నిజామాబాద్లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు.
యాదగిరి కొండపై
పనిచేయని లిఫ్టు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఉన్న లిఫ్టు పని చేయడం లేదు. వీఐపీలు, బ్రేక్ దర్శనం భక్తులు, వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రొటోకాల్ కార్యాలయం సమీపంలో రెండు లిఫ్టులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ 10 రోజులుగా ఈ రెండు లిఫ్టుల్లో ఒక లిఫ్టు పని చేయడం లేదు. దీంతో వీఐపీ ప్రొటోకాల్ దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపైకి లిఫ్టులో వెళ్లేందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అధికారులు త్వరితగతిన లిఫ్టును బాగు చేయించాలని కోరుతున్నారు.
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
భువనగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రైతు బజార్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలంతో చెలగాటం ఆడుతోందన్నారు. ఎన్నికకు ముందు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్రెడ్డి, ఏలె చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, నాయకులు పట్నం శ్రీనివాస్, యాదిరెడ్డి, నరసయ్య, కృష్ణ, వేముల నరేష్, మల్లారెడ్డి, కోటేష్, రామకృష్ణ, నరసింహారావు, బలరాం, జగన్మోహన్రెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.


