యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(వైటీడీ) పాలకమండలి, ఎక్స్అఫీషియో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఆలయ ఈఓ భవానీ శంకర్ తెలిపారు. గురువారం ఈఓ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం ఉదయం 11.37 గంటలకు ఆలయ ముఖ మండపంలోని గర్భాలయం బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. పాలకమండలి చైర్మన్ ఎం. సత్యనారాయణరెడ్డితో పాటు సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్రావు, లక్ష్మీనారాయణనాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్అఫీషియో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కొండకు దిగువన ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు ఈఓ భవానీ శంకర్ తెలిపారు.
టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలి..
యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలని నూతన చైర్మన్తో పాటు సభ్యులను సీఎం రేవంత్రెడ్డి కోరినట్లు ఈఓ వెల్లడించారు. క్యూలైన్లలో నిల్చునే భక్తులకు అర్థగంట సమయంలోనే స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారన్నారు. దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్స్ను పక్కాగా అమలు చేయాలని సూచించినట్లు ఈఓ పేర్కొన్నారు.
కొండ కింద ప్రత్యేక బస్ షెల్టర్లు..
భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం మరింత మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు. కొండకు దిగువన తులసీ కాటేజీ, వైకుంఠద్వారం వద్ద, సెంట్రల్ పార్కింగ్ చెంత బస్ షెల్టర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. అంతేకాకుండా అవసరమైతే రాయగిరి కమాన్ వద్ద బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి యాదగిరి కొండపైకి ఉచితంగా బస్సులను నడిపించేందుకు ఆలోచిస్తున్నామన్నారు.
అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో తొలి సమావేశం
వివరాలు వెల్లడించిన
ఆలయ ఈఓ భవానీ శంకర్


