
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భువనగిరి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని అధికారులకు సూచించారు. సానుకూలంగా స్పందించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. అంతకు ముందు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
రెవెన్యూ సదస్సులో
వడాయిగూడెం గ్రామస్తుల ఆందోళన
భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 518లో ఉన్న 467 ఎకరాలు భూదాన్ భూములుగా రికార్డులో ఉండడంతో తాము అన్ని రకాలుగా నష్టపోతున్నామని వాపోయారు. తమ భూమి భూదాన్లో ఎలా నమోదు అయిందని అధికారులను నిలదీశారు. భూములకు సంబంధించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల అంశం హైకోర్టు పరిధిలో పెండింగ్ ఉందని ఆర్డీఓ కృష్ణారెడ్డి గ్రామస్తులకు తెలిపారు. కాగా.. గ్రామంలో మధ్యాహ్నం తర్వాత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. 119 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి, రెవెన్యూ అధికారులు, రాయగిరి, వడాయిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు