
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
మిర్యాలగూడ: ఆటో చోరీ కేసులో నిందితుడిని గురువారం దామరచర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన వెంపటి శ్రీనివాస్ ఈ నెల 7వ తేదీ రాత్రి 10గంటల సమయంలో తన ఆటోను తన దుకాణం ముందు ఉంచి ఇంటికి వెళ్లి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు ఈ నెల 11న వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పెల్లూరి ఆంజనేయులు గురువారం దామరచర్ల చెక్పోస్టు వద్ద దొంగిలించిన ఆటోలో వస్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పిడుగురాళ్లకు చెందిన కొండపల్లి ఆంజనేయులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.