
గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో లాభాలు పొందవచ్చు
గరిడేపల్లి: గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ. మరియాదాస్ అన్నారు. బుధవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వేర్హౌజ్ డెవలప్మెంట్ రెగ్యూలేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్హౌజ్ రిసిప్ట్పై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యాజమానులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరియాదాస్ పాల్గొని మాట్లాడారు. రైతులు ధాన్యం నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే 10 నుంచి 30శాతం ధాన్యం చీడ పురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. ధాన్యం నిల్వపై ప్రతిఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రైతులను నేరేడుచర్లలోని స్టేట్ వేర్హౌజింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థకు తీసుకెళ్లి ధాన్యం నిల్వ గురించి ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి. ఆదర్శ్, ఎ. కిరణ్, టి. మాధురి, సీహెచ్. నరేష్, రైతులు పాల్గొన్నారు.
ఫ జాతీయ మొక్కల ఆరోగ్య
పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ మరియాదాస్