
అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
నల్లగొండ టూటౌన్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని అన్నారు. ఒక్కో రైతుకు పాత బకాయి రూ.30వేలు ఉందని, ఇలా గత యాసంగిలో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.800కోట్లు రైతు భరోసా నిధులు బాకీ పడ్డారని తెలిపారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా రైతులకు ఇప్పించే బాధ్యత జిల్లా మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాకు కాంగ్రెస్ మంత్రులు చేసిందేమీ లేదని, చేతగాని మంత్రులుగా మిగిలిపోయారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కబ్జాలు, ఆక్రమణలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. వారికి కమీషన్లు వచ్చే పనులను పట్టుకుని ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేందుకు సమయం సరిపోతలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ ఓ బూటకమని, ఫార్ములా–ఈ కేసులో ఏం జరగకపోయినా కేటీఆర్పై కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు, విచారణ అంటూ వేధిస్తున్నారని అన్నారు. కేటీఆర్పై ఇప్పటి వరకు 14 కేసులు అక్రమంగా పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడదని, ప్రజల తరఫునన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, హామీల అమలుపై పోరాటమని చేస్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ గత యాసంగిలో రైతులకు
రూ.800 కోట్లు బాకీ పడ్డారు
ఫ కక్ష సాధింపులో భాగంగానే
కేటీఆర్కు నోటీసులు
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య