
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
హుజూర్నగర్: ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసి ఇస్తానని అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హుజూర్నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడ కృష్ణలంకకు చెందిన చింతల సురేష్బాబు ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులు, వృద్ధులు, మహిళల ఏటీఎం కార్డులను తీసుకొని దాని స్థానంలో నకిలీ కార్డును వారికి ఇచ్చి.. ఆ తర్వాత వారి అసలు ఏటీఎం కార్డులను ఉపయోగించుకొని డబ్బులు కాజేస్తున్నాడు. గతేడాది నవంబర్ 19న హుజూర్నగర్కు చెందిన మంద విజయ కరుణ పట్టణంలోని ఓ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ఇతడి సహాయం కోరగా ఆమె చెప్పిన పిన్ నంబర్ ఉపయోగించి డబ్బులు డ్రా చేసి ఆమెకు డబ్బులతో పాటు నకిలీ ఏటీఎం కార్డును చేతిలో పెట్టి నిజమైన కార్డును తీసుకొని వేరే ప్రదేశాల్లో రూ.1.25 లక్షలు డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సురేష్బాబుపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద సురేష్బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న ఏఎస్ఐ బలరామిరెడ్డి, కానిస్టేబుళ్లు వరప్రసాద్, నాగరాజును సీఐ అభినందించారు.