
కొనుగోళ్లలో రాణించారు
ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు భారీగా కమీషన్
సాక్షి,యాదాద్రి: ధాన్యం కొనుగోలులో మహిళలు శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేశాయి. యాసంగి సీజన్లో తమకు కేటాయించిన ఐకేపీ కేంద్రాల ద్వారా 1,77,228 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.3.44 కోట్లు కమీషన్ రూపంలో ఆర్జించాయి. ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా అతివల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వం.. ధాన్యం సేకరణలోనూ వారికి అవకాశం కల్పించడంతో సత్తా చాటారు.
కొనుగోలు చేసిన ధాన్యం ఇలా..
యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 91 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిని స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. వీటి ద్వారా 1,77,228 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను క్వింటాకు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లించింది. మొత్తం రూ.3.44 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో జమకానున్నాయి. కమిషన్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర ఖర్చులు పోను 50 శాతం డబ్బులు స్రీనిఽధి ఖాతాలో జమ చేస్తారు.
ఇకనుంచి 50 శాతం కేంద్రాలు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 50 శాతం కేటాయించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 30 శాతం అంటే 91సెంటర్లు ఐకేపీకి కేటా యించారు. ప్రస్తుత వానాకాలం 50 శాతం కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 శాతం కేంద్రాలను మాత్రమే కేటాయించేవారు. ఇదిలా ఉండగా యాసంగి సీజన్లో గోకారం, కక్కిరేణి, వెల్లంకి, శోభనాద్రిపురం, శివారెడ్డిగూడెం, పెద్దగూడెంలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించారు.
యాసంగి సీజన్లో 1,77,228
మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రూ.3.44 కోట్లు కమీషన్గా ఆర్జించిన
స్వయం సహాయక సంఘాలు
కొనుగోలు కేంద్రాల్లో 30 శాతం వారివే..
వానాకాలం నుంచి 50 శాతానికి పెంపు
డిపాజిట్లలో నంబర్ వన్
ధాన్యం కొనుగోళ్లలో స్వ యం సహాయక సంఘాల పనితీరు ప్రశంసనీయం. వారికిచ్చిన లక్ష్యాన్ని 45 రోజుల్లోనే పూర్తి చేశారు. ఒక్క యాసంగి సీజన్లోనే కమిషన్ రూపంలో రూ.3.44 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం జిల్లా స్రీనిధి బ్యాంకులో ఐకేపీ కేంద్రాల డిపాజిట్లు రూ.12 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం. ఈ వానాకాలం నుంచి మొత్తం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మహిళా సంఘాలకే కేటాయిస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఓ
శిక్షణ సద్వినియోగం
ధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వ యం సహాయక సంఘాల సభ్యులకు డీఆర్డీఓ ఆధ్వర్యలో శిక్షణ ఇచ్చారు. డేటా ఎంట్రీ, తేమ శాతం చూడటం, బుక్ కీపింగ్, కాంటా వేసిన నంబర్లకు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు తమకు కేటాయించిన కేంద్రాల్లో విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేసి భారీ కమీషన్ ఆర్జించారు.

కొనుగోళ్లలో రాణించారు