
ఇక్కత్ డిజైన్లను డూప్లికేట్ చేస్తే కేసులు నమోదు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను డుప్లికేట్ చేసినా, ప్రింటింగ్ చేసినా, బ్లాక్ పెయింటింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హ్యాండ్లూమ్స్ రీజినల్ డెవలప్మెంట్ కమిషనర్ మంజునాథ్ అన్నారు. మంగళవారం పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘంలో చేనేత వస్త్రాల రిజర్వేషన్ యాక్ట్ పరిరక్షణపై చేనేత కార్మికులు, వివిధ చేనేత సంఘాల నాయకులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 రకాల చేనేత వస్త్రాలకు రిజర్వేషన్ యాక్ట్ కల్పించిందని అన్నారు. ఇందులో చీరలు, దోవతులు, టవల్స్, దుప్పట్లు, బెడ్షీట్స్ తదితర వస్త్రాలు ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్ యాక్ట్ కల్పించిన వస్త్రాలను కేవలం మగ్గాలపై తయారు చేయాలని అన్నారు. అలాకాకుండా పవర్లూమ్స్పై తయారుచేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామన్నారు. అంతేకాక పేటెంట్ హక్కు(జీఐ) కల్గిన వస్త్రాలను వంద కిలోమీటర్ల పరిధిలోనే తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో తయారు చేసినా చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని తెలి పారు. వస్త్ర వ్యాపారులు, కార్మికులు తమ వస్త్రోత్పుత్తులకు సిల్క్మార్క్, హ్యాండ్లూమ్ మార్కు లోగోలు తప్పనిసరి వేయించుకోవాలన్నారు. వినియోగదారులు కూడా సిల్క్మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లోగోలను చూసి వస్త్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర చేనేత జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభయహస్తం కింద నకిలీ వస్త్రాలను నిరోధించేందుకు నాణ్యమైన చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి హ్యాండ్లూమ్ లోగోను అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ లీగల్ అసిస్టెంట్ దీపక్ వంశీ, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఓ రాజేశ్వర్రెడ్డి, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, మాజీ అధ్యక్షుడు తడక రమేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత నాయకులు చిక్క కృష్ణ, గంజి బస్వలింగం, భారత్ భూషణ్, గంజి కృష్ణ, దుద్యాల పాపయ్య, బోడ దయానందం తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్లూమ్స్ రీజినల్ డెవలప్మెంట్ కమిషనర్ మంజునాథ్