
హత్యాయత్నం కేసులో ముగ్గురి రిమాండ్
చివ్వెంల(సూర్యాపేట): భూ వివాదాల కారణంగా వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదాల కారణంగా చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామానికి చెందిన గుండెబోయిన గంగయ్యపై అదే గ్రామానికి చెందిన గుండెబోయిన సైదులు, గుండెబోయిన పెద్దగంగయ్య, గుండెబోయిన శ్రీలత ఈ నెల 15వ తేదీన గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో గంగయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. బాధితుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
కత్తితో దాడి చేసిన వ్యక్తికి..
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన సుంకరి రవికుమార్పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఈ నెల 15న సుంకరి రవికుమార్ బర్రె పాలు పితిక్కొని బైక్పై ఇంటికి వస్తుండగా.. పాతకక్షలను మనుసులో పెట్టుకొన్న ఎర్రబోతు మహేశ్, ఎర్రబోతు శ్యామ్బాబు, ఎర్రబోతు మధు, నర్సింహ అతడిని అడ్డగించి కత్తితో కడుపులో పొడిచి తలపై దాడి చేశారు. ఈ ఘటనలో రవికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రవికుమార్ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఎర్రబోతు మహేశ్ను చౌటుప్పల్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.