ఫలించిన భగీరథ ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన భగీరథ ప్రయత్నం

Jun 16 2025 5:02 AM | Updated on Jun 16 2025 5:02 AM

ఫలించ

ఫలించిన భగీరథ ప్రయత్నం

చండూరు: జియాలజిస్టులు సైతం పరిశీలించి ఆ భూమిలో ఎక్కడ బోరు వేసినా చుక్క నీరు పడదని తేల్చేశారు. అయినా ఆ రైతు తన భగీరథ ప్రయత్నం ఆపలేదు. తన భూమి చుట్టూ కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించి.. చుక్క నీరు పడదని తేల్చిన చోట ఎక్కడ చూసినా గంగ ఉబికి వచ్చేలా మార్చాడు చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి. వర్షపు నీరు భూమిలోనే ఇంకిపోయేలా సత్యనారాయణరెడ్డి తనకున్న దాదాపు 100 ఎకరాల్లో ఆరేళ్ల క్రితమే కందకాలు తవ్వించారు. 2 సంవత్సరాల క్రితం మళ్లీ ఆ కాలువల్లో పూడిక తీయించారు. గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో గల 50 ఎకరాల్లో ఒక్కోటి ఎకరం విస్తీర్ణంలో 4ఎకరాల్లో వేర్వేరుచోట్ల ఫాంపాండ్‌ లాంటి నీటి గుంతలను తవ్వించారు. దీంతో 50 ఎకరాల్లో పడిన ప్రతి వాన చినుకు భూమిలోకి ఇంకగా.. మిగిలిన నీరు కందకాల ద్వారా ఇంకుడు గుంతల్లోకి, ఫాంపాండ్‌లలోకి చేరేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎండాకాలంలో కూడా రెండు గుంతల్లో నీరు అలానే ఉంది. దీని ద్వారా వస్తున్న నీటి లభ్యత, భూగర్భ జలాలతో మిగిలిన 46 ఎకరాల్లో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలతో పాటు జొన్న సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, ఖర్జూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ పండిస్తున్నారు. అంతేగాక వందల్లో వేప, యూకలిప్టస్‌, కానుగ చెట్లు పెంచుతున్నారు. ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించే విషయంలో రైతులకు ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఈ ఒక్క సంవత్సరమే చండూరు మండలంలో దాదాపు 50 మందికి పైగా రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూగర్భ జలాలకు కొదవ ఉండదనేది నిపుణుల అభిప్రాయం.

తనకున్న భూమిలో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించిన రైతు

తోటలకు, పంటల సాగుకు

పుష్కలంగా లభ్యమవుతున్న నీరు

వాన నీటిని ఒడిసి పట్టుకోవాలి

భూమి ఉన్న ప్రతి రైతు వాన నీటిని ఒడిసి పట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నేను సొంత ఖర్చులతో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నాను. ఇప్పుడు ఎండాకాలంలో కూడా తోటలకు, ఇతర పంటలకు నీటి సమస్య అనేదే లేదు. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా రైతులకు సహాయ సహకారాలు అందించాలి. – పాల్వాయి సత్యనారాయణరెడ్డి,

రైతు, బంగారిగడ్డ

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ పథకం ద్వారా చాలా మంది రైతులు తమ భూముల్లో ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకుంటున్నారు. ఈ సంవత్సరం వేసవిలో చండూరు మండలంలో దాదాపు 50 మంది రైతులు ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వించుకున్నారు. మిగతా రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి.

– శ్రీనివాస్‌, ఉపాధి హామీ ఏపీఓ

ఫలించిన భగీరథ ప్రయత్నం1
1/3

ఫలించిన భగీరథ ప్రయత్నం

ఫలించిన భగీరథ ప్రయత్నం2
2/3

ఫలించిన భగీరథ ప్రయత్నం

ఫలించిన భగీరథ ప్రయత్నం3
3/3

ఫలించిన భగీరథ ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement