
విజయవిహార్లోని గదుల అద్దె పెంపు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయ తీరంలోని విజయవిహార్ అతిథి గృహంలో పర్యాటకులు బస చేసే గదులకు అద్దెలను భారీగా పెంచారు. పెంచిన ధరలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్తర్వులిచ్చింది. సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో నిర్మించిన ఈ అతిథి గృహంలో బస చేసే పర్యాటకులకు వెనుక భాగంలో జలాశయం వ్యూ కనబడుతుంటుంది. ఈ అతిథి గృహంలో ఎంతో మంది రాజకీయ నాయకులు బస చేశారు. ఎందరో సినీ నిర్మాతలు, గేయ రచయితలు, దర్శకులు కథలతో పాటు సినిమా పాటలు రాసుకునేందుకు ఇక్కడికి వచ్చి వారాల తరబడి ఇందులో బస చేస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి ఈ భవనానికి మరమ్మతులు చేశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో అప్పటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో కేవలం ఫర్నీచర్, ఏసీలను మార్చారు. తిరిగి 2024 చివరలో మరమ్మతులు చేసేందుకు అంచనాలు తయారు చేసి రూ.5కోట్ల నుంచి రూ.15 కోట్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించి తొలి దశలో రూ.5కోట్లకు టెండర్లు పిలిచారు. ఇటీవల ప్రపంచ సుందరీమణులు నాగార్జునసాగర్కు వచ్చిన సందర్భంగా పనులను వేగవంతం చేసి ముందుగానే ఆధునీకరణ పనులు పూర్తిచేశారు. పాత భవనం కావడంతో స్లాబుకు మరమ్మతులతో పాటు టైల్స్, మార్బుల్ బండలు వేశారు. రంగులతో పాటు గదుల ముందుగల లాన్లలో తివాచీ గడ్డిని పరిచారు. సూట్ రూములలో కొత్త మంచాలతో పాటు బెడ్స్ను మార్చారు. సూట్ రూములలో ఫైవ్ స్టార్ హోటల్స్ను తలపించేలా ఏర్పాట్లు చేశారు. విదేశీయులు సైతం బస చేసేవిదంగా ఆధునీకరించినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
30 శాతానికి మించి పెరిగిన అద్దె..
విజయవిహార్లో మూడు రకాల భవనాలు ఉంటాయి. అత్యంత విలాసవంతమైన విజయవిహార్ భవనంలో 10 సూట్ రూములు ఉంటాయి. ఈ రూములకు గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అద్దె రూ.3472 ఉండగా, శని, ఆదివారాల్లో రూ.4200గా ఉండేది. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు జీఎస్టీతో కలిపి రూ.4,704 ఉండగా, శని, ఆదివారాలలో రూ.5,600గా నిర్ణయించారు. అదేవిధంగా సరోవర్ భవనంలో 8 డీలక్స్ రూములు ఉంటాయి. వీటికి గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.2600, శని, ఆదివారాల్లో రూ.3400 అద్దె ఉండేది, ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.3,024, వారాంతంలో రూ.3,920గా అద్దె పెంచారు. సమాగమంలో 20 స్టాండర్డ్ గదులు ఉంటాయి. గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రూ.2016, వారంతంలో రూ.2,700 అద్దె ఉండేది. ఇప్పుడు వారం మొదట్లో రూ.2,352, శని, ఆదివారాల్లో రూ.3024గా అద్దె పెంచారు.
గతంలో కంటే 30 శాతం పెరుగుదల