
గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. వివరాలు.. మూసీ రోడ్డులో నివాసముంటున్న కాడింగు కొండయ్య ఇంట్లో గ్యాస్ సిలిండర్లో అయిపోవడంతో ఆదివారం కొత్త సిలిండర్ అమర్చారు. అనంతరం వంట చేసుకునేందుకు గాను గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా.. ఒక్కసారిగా సిలిండర్ వద్ద మంటలు చెలరేగాయి. ఇళ్లంతా పొగ ఆవరించింది. చుట్టుపక్కల ఇళ్ల భయాందోళనకు గురయ్యారు. కొండయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని చిన్న చిన్న వస్తువులు కాలిపోయాయని బాధితుడు కొండయ్య తెలిపాడు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొండయ్య ఇంటిని పరీశీలించి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు.
చికిత్స పొందుతూ
గీత కార్మికుడు మృతి
తుంగతుర్తి: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన గీత కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల సోమయ్య(57) ఈ నెల 2వ తేదీన కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మాజీ వార్డు సభ్యుడైన సోమయ్య భౌతికకాయానికి మాజీ ఎంపీపీ గుండాగాని కవితారాములుగౌడ్, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన గుణగంటి మధు(35) ఈ నెల 8వ తేదీన బైక్పై నెమ్మికల్ నుంచి ఆత్మకూర్ మండల కేంద్రానికి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు