
ఉన్నతాధికారులతో విచారణ చేయించాలి
యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీర్ల ఐలయ్య ఇంట్లో గంధమల్ల రవి ఆత్మహత్యపై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిపై ఓ ప్రజాప్రతినిధిగా, ఆలేరు ఎమ్మెల్యేగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బీర్ల ఐలయ్యకు ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి రవి మృతదేహాన్ని అప్పటికప్పుడే పంచనామా చేసి, భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రవి మృతిచెందాడని ప్రచారం జరుగుతుందన్నారు. లోకల్ పోలీసులతో విచారణ జరిపిస్తే సరిగ్గా చేయరని, కమిషనరేట్ పరిధిలో నిజాయితీగా ఉండే అధికారితో విచారణ చేపట్టి నిజాలు బయట పెట్టాలని రాచకొండ సీపీ సుధీర్బాబును కోరామన్నారు. రవి ఆత్మహత్యను పక్కదోవ పట్టించేందుకే బీర్ల ఐలయ్య, స్థానిక పోలీసులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాంతియుత వాతావరణంలో కర్రె వెంకటయ్య నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కర్రె వెంకటయ్యకు ఏం జరిగినా ఐలయ్య, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. కురుమ సామాజిక వర్గానికి చెందిన వెంకటయ్య రాజకీయంగా ఎదగకుండా ఐలయ్య కుట్ర చేస్తున్నారన్నారు. ఐలయ్య, పోలీసుల దౌర్జన్యాలపై నియోజకవర్గ వ్యాప్త బంద్కు పిలుపునిస్తామని అన్నారు. ఐలయ్య ఇప్పటికై నా రవి కుటుంబానికి రూ.2కోట్ల సాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్రెడ్డి, యూత్ సెక్రటరీ విజయ్, రాజేష్యాదవ్, సతీష్గౌడ్, కుమార్, గజం అశోక్, సూరి, శ్రావణ్, వీరారెడ్డి తదితరులున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి