
బడిబాట ద్వారా 100 అడ్మిషన్లు
భువనగిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు కొత్తగా 100 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఉండగా గత ఏడాది ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసే నాటికి 260 మంది విద్యార్థులున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు 100 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 360కి చేరింది. బడిబాట ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుందని, విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ తెలిపారు.
కళాశాలల్లో విద్యార్థులనమోదు పెంచండి
సాక్షి,యాదాద్రి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు పెంచాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం వచ్చిన అడ్మిషన్ల వివరాలను కళాశాలల వారీగా సమీక్షించారు. కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి గడువు ఉన్నందున ఆలోపు టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, స్లిప్ టెస్టులు నిర్వహించి అందులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఉన్నతస్థానం వెళ్లేలా నాణ్యమైన విద్యను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు.
సీఎం కప్ విజేతలకు అభినందన
భువనగిరి: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కిక్బాక్సింగ్ విభాగంలో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి తన చాంబర్లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. మున్ముందు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిలా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు, గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్, మాస్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపవర్మెంట్ బోర్డు అధ్యక్షుడిగా సత్యనారాయణ
భూదాన్పోచంపల్లి: సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడిగా భూదాన్పోచంపల్లి పట్టణానికి చెందిన దోర్నాల సత్యనారాయణ నియామకం అయ్యారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం పాటుపడుతానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా స్థాయి కమిటీలు నియమించి బోర్డును బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

బడిబాట ద్వారా 100 అడ్మిషన్లు

బడిబాట ద్వారా 100 అడ్మిషన్లు