హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేశాం | - | Sakshi
Sakshi News home page

హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేశాం

Jun 13 2025 4:35 AM | Updated on Jun 13 2025 4:35 AM

హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేశాం

హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేశాం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాద విభాగంలోని గోదాంలో ఇటీవల చింతపండు చోరీ జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపించేందుకు హైలెవల్‌ కమిటీని వేసినట్లు ఈఓ వెంకట్రావ్‌ తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పైన తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చింతపండు చోరీ జరిగిన తర్వా నియమించిన ఫైమెన్‌ కమిటీతో సమగ్ర వివరాలు తెలియరాలేదన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు గతంలో ఏమైనా జరిగాయా అనే అంశాలను లోతుగా పరిశీలించేందుకు దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌, రంగారెడ్డి, నల్లగొండ, సికింద్రాబాద్‌కు చెందిన దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్లతో హైలెవల్‌ కమిటీ వేశామని వెల్లడించారు. ఈ కమిటీ సభ్యులు సోమవారం నుంచి ఆలయానికి వచ్చి విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎండోమెంట్‌ కమిషనర్‌గా తానే ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ప్రతిరోజు 4వేల మందికి

ఉచితంగా పులిహోర ప్రసాదం..

స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 3వేల నుంచి 4వేల మందికి 250 నుంచి 300 కిలోల పులిహోర ప్రసాదం ఉచితంగా అందజేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి మాదిరిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించి, వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.

రింగ్‌ రోడ్డు చుట్టూ సర్కిళ్లకు పేర్లు..

సత్యనారాయణస్వామి వ్రత మండపంలో వ్రతాలు చేయించే భక్తులకు స్వామి వారి శేష వస్త్రం, కనుమ, స్వామి వారి ప్రతిమను ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు రూట్‌ అర్థంకావడం కోసం యాదగిరి కొండ చుట్టూ ఉన్న రింగ్‌ రోడ్డులో పలు సర్కిళ్లకు పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. వైకుంఠద్వారం వద్ద సర్కిల్‌ రోడ్డుకు శ్రీఅభయాంజనేయ సర్కిల్‌ అని, ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న సర్కిల్‌కు గరుడ సర్కిల్‌, కొండపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డు వద్ద ఉన్న సర్కిల్‌కు రామానుజ సర్కిల్‌, మల్లాపురానికి వెళ్లే మార్గంలో ఉన్న సర్కిల్‌కు యాదర్షి సర్కిల్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఆయా సర్కిళ్ల వద్ద మూడు, నాలుగు నెలల్లో విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసం పెద్ద లిఫ్టు (25 మంది ఒకేసారి వెళ్లడానికి) పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం అనుమతి తీసుకొని పనులు చేపడతామన్నారు. శనివారం, ఆదివారం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లలో మజ్జిగ, తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. బ్యాటరీ వాహనాలను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొండ పైన హోంగార్డు సిబ్బంది తక్కువగా ఉన్నారని, భద్రతా సిబ్బందిని పెంచే దిశగా పోలీస్‌ ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, అధికారులు దయాకర్‌రెడ్డి, రామారావు ఉన్నారు.

వ్రత మండపాన్ని తనిఖీ చేసిన ఈఓ

యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని ఈఓ వెంకట్రావ్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్రతాల నిర్వహణ తీరును, భక్తులకు ఇస్తున్న సామాగ్రి, ప్రసాదాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, అర్చకులకు సూచించారు.

ఫ చింతపండు చోరీ ఘటనపై

వారం రోజుల్లో విచారణ పూర్తిచేస్తాం

ఫ యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement