
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
దేవరకొండ: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.17లక్షలు వసూలు చేసి పరారైన నిందితుడిని గురువారం దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాల్రెడ్డి 2021లో దేవరకొండకు వలస వచ్చి స్థానిక బీఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. అతడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్టు ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడు పనిచేసే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి కాలనీకి చెందిన ముడావత్ స్వాతి, ఆమె భర్త రమేష్, షేక్ సైదాబేగం, ఆమె కుమారుడు షేక్ తబ్రీజ్తో పరిచయం పెంచుకున్నాడు. వారిని తన మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుంచి సుమారు రూ.17లక్షలు వివిధ దఫాలుగా తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారు ఉద్యోగాల విషయం ఏమైందంటూ అడిగినప్పుడల్లా టైం పడుతుందని చెబుతూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల వారు కృష్ణను గట్టిగా నిలదీయగా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. దీంతో బాధితులు మార్చి 1న దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం నిందితుడిని ఏపీలోని అనంతపురం జిల్లాలో అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే కృష్ణ గతంలో తన భార్యతో కలిసి ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడని, టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక అక్కడ కొద్దిమందితో కలిసి చిట్టీలు నిర్వహించి అక్కడి నుంచి అనంతపురానికి పరారైనట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. అనంతపురంలో అక్కడ కూడా కొందరిని మోసం చేసి దేవరకొండకు వచ్చాడని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐలు కోటేష్, నారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, రాజారాం, అంజి, వెంకన్న, చాంద్పాషా, సింహాద్రి పాల్గొన్నారు.
ఫ నిందితుడి అరెస్ట్
ఫ రూ.8లక్షలు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
దేవరకొండ ఏఎస్పీ మౌనిక