
11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన అద్భుతం
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలో 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన అద్భుతంగా ఉందని, 70 ఏళ్లలో చేయని దేశాభివృద్ధిని 11 ఏళ్లలోనే ప్రధాని మోదీ చేసి చూపించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు 2జీ స్కాం, బొగ్గు స్కాం, భోఫోర్స్ స్కాం ఉండేవని తెలిపారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి నమూనాతో మోదీ నాయకత్వంలోనే బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. స్వచ్ఛ భారత్ కింద కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు పేదలకు 4కోట్ల ఇళ్లు మంజూరు చేసిన ఘటన మోదీదే అన్నారు. గతంలో తెలంగాణలో 2500 కి.మీ. మేర జాతీయ రహదా రులు ఉండగా.. 11 ఏళ్లలోనే మరో 2500 కి.మీ. నిర్మించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త లైన్లు, గ్రామాల్లో బీటీ రోడ్లు లాంటి అభివృద్ధి చేసినా కాంగ్రెస్ నేతలు చూడలేకపోతున్నారని అన్నారు. 12 నెలల రేవంత్రెడ్డి పాలన చూసిన ప్రజలు మరో 20ఏళ్ల పాటు కాంగ్రెస్కు ఓటెయ్యరని అన్నారు. 10 శాతం కమీషన్ చెల్లిస్తేనే బిల్లులు వస్తున్నాయని, కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. నంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీయించిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక 7సార్లు పొడిగించారని, ఫోన్ ట్యాపింగ్ తదితర వాటిపై వేసిన కమిషన్ల మీద ప్రజలకు నమ్మకం లేదన్నారు. అనంతరం మోదీ 11 ఏళ్ల సుపరిపాలన కరపత్రాలను బీజేపీ నేతలతో కలిసి ఈటల ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు సునీతారెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజు, పల్లెబోయిన శ్యాంసుందర్, షేక్ బాబా, నివేదిత తదితరులు పాల్గొన్నారు.
ఫ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్