రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి

Jun 13 2025 4:35 AM | Updated on Jun 13 2025 4:35 AM

రోడ్డు ప్రమాదంలో  మాజీ సర్పంచ్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి

శాలిగౌరారం: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి చెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామ శివారులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ వజ్జె భిక్షం(56) బుధవారం పని నిమిత్తం బైక్‌పై శాలిగౌరారం మండల కేంద్రానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో వద్దిపాముల గ్రామ శివారులో రోడ్డు పక్కన బైక్‌ ఆపి మూత్రవిసర్జన చేసి తిరిగి బైక్‌ ఎక్కుతుండగా.. పెర్కకొండారం గ్రామానికి చెందిన గంట వీరయ్య అతివేగంగా వచ్చి భిక్షంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భిక్షం, వీరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భిక్షం మృతిచెందాడు. వీరయ్య కోమాలో ఉన్నట్లు తెలిసింది. భిక్షంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భిక్షం భౌతికకాయానికి డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్‌ నివాళులర్పించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని..

నార్కట్‌పల్లి: స్కూటీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందారు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల కేంద్రం శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఎస్‌కే అమీర్‌(23) తన స్నేహితుడు షోయబ్‌తో కలిసి స్కూటీపై హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్నారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి మండల కేంద్రం శివారులోని త్రిపుర హాటల్‌ సమీపంలో.. నిజామాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. అమీర్‌ రోడ్డుపై పడిపోగా.. అతడి తల పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటీపై వెనుక కూర్చున్న షోయబ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని అమీర్‌ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బాబాయి మహ్మద్‌ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ..

రామన్నపేట: తాటిచెట్టు పైనుంచి పడి గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన గీత కార్మికుడు నోముల నర్సింహ చిన్న కుమారుడు వంశీ(24) మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement