
బాలుడి ఆచూకీ లభ్యం
నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిడ్నాప్కు గురైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన నారాయణ దాస్ అరుణ, జంతిక చుక్కమ్మ అలియాస్ (పాలడుగు సుగుణమ్మ) ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం తుంగపహాడ్కు చెందిన బైరం భాగ్యలక్ష్మి 8 నెలల గర్భిణి. రెండో కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఈ నెల 8వ తేదీన భర్త అంజిబాబు, కుమారుడు సోమేష్తో కలిసి వచ్చింది. వారి వెంట ఇంటి పక్కన ఉండే కుంచం పార్వతమ్మ కూడా ఆస్పత్రికి వచ్చింది. భాగ్యలక్ష్మి లేబర్ వార్డులో చేరింది. అప్పటి నుంచి ఆమె బాగోగులు పార్వతమ్మ చూస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఉన్న ప్రసూతి విభాగం ఎదుట భాగ్యలక్ష్మి తన కుమారుడు సోమేష్, వెంట వచ్చిన పార్వతమ్మ చెట్టు కింద కూర్చున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నారు. బాలుడిని ఆడిస్తున్నట్లుగా చేసి, మీరిద్దరూ భోజనం చేసి రండి బాలుడిని చూసుకుంటాం అని చెప్పడంతో వారు భోజనానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన మహిళలు బాలుడిని కిడ్నాప్ చేశారు. తిరిగి వచ్చేసరికి బాలుడితో పాటు ఇద్దరు మహిళలు కనిపించలేదు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్లో పార్వతమ్మ ఫిర్యాదు చేసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేశారు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలోని ఏ1 నారాయణదాసు అరుణ తల్లి ఇంటి వద్ద వీరిద్దని పట్టుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుని కిడ్నాప్ కేసును ఏడు గంటల్లోనే చేధించి, నిందితులను పట్టుకున్న టూటౌన్ సీఐ రాఘవరావు నార్కట్పల్లి సీఐ నాగరాజు, టూటౌన్ ఎస్ఐ సైదులు, సతీష్, భువనగిరి సీఐ రమేష్, పోలీసులు రాజు, సాగర్ల శంకర్, జానకిరామ్, తిరుమలేష్లను ఎస్పీ అభినందించారు.
కిడ్నాప్కు గల కారణాలు..
నారాయణదాసు అరుణకు కుమారుడు. కుమార్తె ఉన్నారు. సంవత్సరం క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మగ పిల్లలపై ప్రేమతో ఏ విధంగా నైనా బాలుడిని పెంచుకోవాలని అనుకుంది. ఈవిషయాన్ని దమ్మాయిగూడెంలో తాను నివసిస్తున్న ఇంటి పక్కన గల మరో మహిళ జంతిక సుక్కమ్మ అలియాస్ (పాలడుగు సుగుణమ్మ)తో చెప్పింది. ఇద్దరూ కలిసి నల్లగొండకు బస్సులో వచ్చి ఆస్పత్రి ఏరియాలో చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉండడాన్ని గమనిస్తూ వచ్చారు. తల్లిదండ్రులు లేని సమయం చూసి బాలుడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో బాలుడితో కలిసి భాగ్యలక్ష్మి, పార్వతమ్మ చెట్టుకింద కూర్చొని ఉండగా.. వారితో మాటలు కలిపి వారిని నమ్మించారు. వారు లేని సమయంలో బాలుడిని తీసుకుని పరారయ్యారు.
ఫ కిడ్నాప్ కేసును 7 గంటల్లోనే
చేధించి బాలుడిని తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు
ఫ వివరాలు వెల్లడించిన
డీఎస్పీ శివరాంరెడ్డి

బాలుడి ఆచూకీ లభ్యం