
రేషన్ బియ్యం పట్టివేత
దేవరకొండ: అక్రమంగా తరలిస్తున్న 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవరకొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి నుంచి బొలెరో వాహనంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కల్వకుర్తి వైపు తరలిస్తుండగా సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అస్వస్థతకు గురై
వలస కార్మికుడు మృతి
చౌటుప్పల్ : వలస కార్మికుడు అస్వస్థతకు గురైన మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్కండ్ రాష్ట్రం వెస్ట్సింగ్భుం జిల్లా, మంజరి మండలం, బారాలగ్రా గ్రామానికి చెందిన కృష్ణ(39) జీవనోపాధి నిమిత్తం 40రోజుల క్రితం పట్టణంలోని శ్రీని ఫార్మా కంపెనీకి వచ్చాడు. పరిశ్రమలో కూలీ పని చేస్తూ అక్కడే ఉన్న కంపెనీ క్వార్టర్స్లో సహచరులతో కలిసి ఉంటున్నాడు. ఒళ్లు, కాళ్లనొప్పులు ఉన్నాయని గత రెండు రోజులుగా పనికి వెళ్లకుండా గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం సమయంలో చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో సహచరులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి అల్లుడు మహేంద్రపాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
బంగారం చోరీ
కేసులో వ్యక్తికి జైలు
చివ్వెంల(సూర్యాపేట) : బంగారం చోరీ కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళీ బుధవారం తీర్పు వెల్లడించారు. అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు తిరుమలేష్ 2016లో సూర్యాపేట పట్టణంలో మూడు ఇళ్లలో చొరబడి, బంగారం అపహరించాడు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ మొగిలయ్య కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ చేశారు. పీపీ బి.హేమలత నాయుడు వాదనలతో ఏకీభవిస్తూ, పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఒక్కో కేసులో 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పీపీకి కోర్టు కానిస్టేబుల్ పత్తిపాక వెంకటేశ్వర్లు సహకరించారు.
నీటిపారుదల శాఖ
జేఈఈ ఆత్మహత్య
బయ్యారం: నీటిపారుదల శాఖ జేఈఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెం గ్రామానికి చెందిన పానుగోత్ దేవిలాల్(34) ఇరిగేషన్ శాఖలో జేఈఈగా గార్ల మండలంలో పనిచేస్తున్నాడు. దేవిలాల్ దివ్యాంగుడు. బయ్యారంలో గది అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో దేవిలాల్ బుధవారం రాత్రి తన గదిలో పురుగులమందు తాగగా.. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్సనిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. జేఈఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.