
డబ్బులు ఇవ్వాలని మహిళ బెదిరింపు
చిలుకూరు: తనకు డబ్బులు ఇవ్వాలని ఓ మహిళ యువకుడిపై బెదిరింపులకు పాల్పడింది. మంగళవారం రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువకుడి ఇంటికి చేరుకుని దాడికి దిగింది. అక్కడికి గ్రామస్తులు చేరుకోవడంతో ఇద్దరు పరారు కాగా.. ఒకరిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన చిలుకూరు మండలంలోని సీత్లాతండా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సీత్లాతండాకు చెందిన నూనావత్ సక్రు – మంగమ్మ చిన్న కుమారుడు వినోద్ కారు ట్యాక్సీ డ్రైవర్గా పని చేసేవాడు. ఫోన్లో తమిళనాడుకు చెందిన మంగా అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో ఆమె వద్ద కారు డ్రైవర్గా పని చేశాడు. ఈక్రమంలో వారి మధ్య వివాదం రావడంతో వినోద్ ఆమె దగ్గర ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. దీంతో ఆ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని వినోద్ను బ్లాక్ మొయిల్కు గురి చేస్తోంది. ఈమేరకు 2023 నవంబర్ 13న చిలుకూరు పోలీస్స్టేషన్లో వినోద్ తల్లి మంగమ్మ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురిని పిలిపించి మాట్లాడి సమస్యను సద్దమణిగించారు. ఈక్రమంలో సీత్లాతండాలో మంగళవారం రాత్రి గ్రామస్తులు తుల్జాభవానీ పండుగ నిర్వహిస్తుండగా.. తమిళనాడుకు చెందిన మంగా వైరాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి వినోద్ ఇంటికి వచ్చింది. తమకు డబ్బులు ఇవ్వాలని గొడవ చేసి, వినోద్ తండ్రి సక్రును తలపై కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో వినోద్ తల్లి మంగమ్మకు కూడా గాయాలయ్యాయి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు ముగ్గురిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న మహిళ తో పాటు మరో వ్యక్తి పరారు కాగా.. ఒకరిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సక్రు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని స్టేషన్కు తీసుకెళ్లారు. ఉదయం పరారైన మరో వ్యక్తి బుధవారం పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా.. తమను స్తంభానికి కట్టేసి కొట్టారని వారు కూడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఇరు కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఫ ఇద్దరు వ్యక్తులతో కలిసి యువకుడి ఇంటికి వచ్చి దాడి
ఫ ఇద్దరు పరారు కాగా.. ఒకరిని
స్తంభానికి కట్టేసి చితకబాదిన
గ్రామస్తులు
ఫ చిలుకూరు మండలం
సీత్లాతండాలో ఘటన