
సాగులో నూతన పద్ధతులు అవలంబించాలి
రామగిరి(నల్లగొండ): వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. త్రిపురారం మండలం కంపాసాగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బుధవారం నల్లగొండ మండలంలోని తొరగల్లు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ రావు యూరియా వినియోగం, సమర్థ సాగు వినియోగం, పంట అవసరాల కొనుగోళ్లలో రసీదులను భద్రపరుచుట, రసాయనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ నూతన వ్యవసాయ పద్ధతులను వివరించారు. పంటల సరళి, జీలుగ, జనుము ఉపయోగాలను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు లాభాలను ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి వివరించారు. కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ ఆఫీసర్ కిషోర్, వ్యవసాయ విస్తరణ అధికారి సత్యనారాయణ, అభ్యుదయ రైతులు రామ్రెడ్డి, కృష్ణారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.