
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థికసాయం
మునగాల: ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి పోలీసు కానిస్టేబుల్ ఆర్థికసాయం చేసి, వారి సొంతూరికి పంపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. నెల్లూరు జిల్లా కాగుటూరు గ్రామానికి చెందిన దంపతులు మణి– సరోజలు తమ ఇద్దరు చిన్నారులతో జీవనోపాధి నిమిత్తం జనగామ జిల్లాలోని ఓ బొగ్గుల బట్టి వ్యాపారి వద్ద పనికి చేరారు. నెలన్నర రోజుల పాటు పనులు చేయించుకున్న సదరు వ్యాపారి ఆ దంపతులకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా మోసం చేసి పంపించాడు. ఆ దంపతులు చేతిలో చిల్లిగవ్వ లేక జనగామ నుంచి కాలినడకన జాతీయ రహదారి వెంట నెల్లూరు జిల్లాకు బయలుదేరారు. సూర్యాపేటలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వర్తిస్తున్న మునగాల మండలంలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన మొగిలిచర్ల నరేష్ బుధవారం తన స్వగ్రామం వెళ్తుండగా ఈ దంపతులు కనిపించారు. వారిని చేరదీసి ఇంటికి తీసుకువెళ్లి ఆహారం అందించాడు. వారికి జరిగిన అన్యాయాన్ని తమ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. వారిని ఆదుకునేందుకు రూ.10వేల నగదును సేకరించి ఆ దంపతులకు అందజేశాడు. తమను ఆదుకున్న నరేష్కు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపి స్వగ్రామం బయలుదేరి వెళ్లారు.