నకిలీ విత్తనాల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు

Jun 11 2025 7:40 AM | Updated on Jun 11 2025 7:40 AM

నకిలీ

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు

సూర్యాపేటటౌన్‌ : నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట ఎస్పీ కె. నర్సింహ తెలిపారు. వారి నుంచి రూ.65 లక్షల విలువ గల 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ బస్‌ స్టేజీ వద్ద ఈ నెల 9న సీపీఎస్‌ పోలీసులు, ఆత్మకూర్‌(ఎస్‌) పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన తండా నగేష్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడు 120 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను గోనె సంచిలో పెట్టుకొని ని బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. నగేష్‌.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన పంది రాము వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పంది రామును అతని గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించగా.. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం గ్రామంలో బానోతు జయరాం షాపులో కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అలాగే జయరాం షాపునకు గుంటూరు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన తరిగొప్పుల శ్రీనివాసరావు సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో జయరాంను, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా.. బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన మాగులూరి సాంబశివరావు అనే వ్యక్తి అరుణోదయ అనే నకిలీ పత్తి విత్తన కంపెనీ నిర్వహిస్తూ విత్తనాలు తయారు చేస్తున్నాడు. తరిగొప్పుల శ్రీనివాసరావు మధ్యవర్తిగా ఉంటూ కర్నూలు జిల్లా పల్లిపాడు గ్రామానికి చెందిన చెవుల నర్సింహులుతో సరఫరా చేస్తున్నట్లు తేలింది. జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా ఈ బస్తాలో ఒక్కొక్క దానిలో 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ సుమారు రూ.63 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో తండ నగేష్‌, పంది రాము, బాణోతు జయరాం, తరిగొప్పుల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. ఏ–1 అయిన అరుణోదయ నకిలీ పత్తి విత్తనాల కంపెనీ ఎండీ మాగులూరి సాంబశివరావు, ఏ–6 చెవుల నర్సింహులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మరో కేసులో ఇద్దరు అరెస్టు

ముందస్తు సమాచారం మేరకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌ గ్రామానికి చెందిన వెలుగు శ్రీను అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 9న జిల్లా సీపీఎస్‌, మోతె పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అతని ఇంట్లో అడ్వాన్స్‌ 333, అరుణోదయ అనే నకిలీ పత్తి విత్తనాల కంపెనీల పేరుతో ఉన్న 98 ప్యాకెట్ల స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. శ్రీను బంధువైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహన అనే వ్యక్తితో కలిసి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ రైతులకు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నామని ఒప్పుకున్నాడు. వెంటనే శాతవాహన అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద 30 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరికి ఈ విత్తనాలు సరఫరా చేస్తున్న మరో వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నలుగునూర్‌కు చెందిన తిరుమల్‌గా గుర్తించారు. ప్రస్తుతం తిరుమల్‌ పరారీలో ఉండగా అతనిని పట్టుకునేందుకు పోలీస్‌ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో రూ.2లక్షల విలువ చేసి 58 కేజీల నకిలీ విత్తాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో బాగా పని చేసిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీసీఎస్‌ సీఐ శివకుమార్‌, సూర్యాపేట రూరల్‌ సీఐ రాజశేఖర్‌, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి, ఆత్మకూరు ఎస్‌ఐ శ్రీకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ రూ.65లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

ఫ వివరాలు వెల్లడించిన

సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు1
1/1

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement