వ్యక్తిపై దాడి కేసులో నలుగురి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై దాడి కేసులో నలుగురి రిమాండ్‌

Jun 11 2025 7:40 AM | Updated on Jun 11 2025 7:40 AM

వ్యక్తిపై దాడి కేసులో  నలుగురి రిమాండ్‌

వ్యక్తిపై దాడి కేసులో నలుగురి రిమాండ్‌

చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన నలుగురిని మంగళవారం పోలీసులు రిమాండ్‌ చేశారు. సూర్యాపేట రూరల్‌ సీఐ రాజశేఖర్‌ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన ధరావతు అశోక్‌పై గత నెల 23వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గ్రామ శివారులోని లక్ష్మీనగర్‌ టౌన్‌షిప్‌లో దాడి చేశారు. దీంతో అశోక్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ మహేశ్వర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన అల్లకుంట్ల రాము, ఓర్సు కేశవ, ఇద్దరు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ కనకరత్నం, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో

బలవన్మరణం

గరిడేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ చలికంటి నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాయినిగూడెం గ్రామానికి చెందిన గుండు మహేష్‌(36) గత కొన్నేళ్లుగా కీతవారిగూడెంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు ఇటీవల పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో పిల్లల చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ జీవితంపై విరక్తితో మంగళవారం ఉదయం తన భార్య షాపు వద్దకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య సంధ్యావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విహారయాత్రకు వద్దన్నారని..

యాదగిరిగుట్ట: విహారయాత్రకు వెళ్లేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం జరిగింది. వివరాలు.. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లికి చెందిన గంగాధార్‌ భరత్‌(17) ఇంటర్‌ ఫస్టియర్‌ పూర్తిచేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం విహారయాత్రకు వెళ్తానని తల్లిదండ్రులను అడిగాడు. ఇల్లు కట్టుకోవడానికే డబ్బులు లేవు.. ఇప్పుడు టూర్‌కు ఎందుకని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన భరత్‌ ఇంటి వెనుక గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి భువనగిరి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే భరత్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాస్కర్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

నకిరేకల్‌: మద్యం మత్తులో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్‌ మండల పరిధిలోని అరెంపుల గ్రామానికి చెందిన వల్లురు భూపాల్‌రెడ్డి(52)కి నకిరేకల్‌ మండలం మండలాపురం గ్రామానికి చెందిన జానకితో వివాహమైంది. గతేడాది నుంచి భూపాల్‌రెడ్డి మండలాపురంలో తన అత్తగారింట్లోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు(కవల పిల్లలు) ఉన్నారు. మద్యానికి బానిసైన భూపాల్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన తన అత్తగారి నిమ్మతోటకు వెళ్లాడు. మద్యంలో మత్తులో తోటలో గడ్డి మందు తాగాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తాను గడ్డి మందు తాగానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. అప్పటికే అపస్మాకరస్థితిలోకి వెళ్లిన భూపాల్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నకిరేకల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రిష్ణమాచారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement