
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో బాలుడి కిడ్నాప్
నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం బాలుడు(20 నెలలు) కిడ్నాప్కు గురయ్యాడు. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామానికి చెందిన బైరం భాగ్యలక్ష్మి, అంజిబాబు దంపతులకు మొదటి కాన్పులో కుమారుడు సోమేష్ కుమార్(20 నెలలు) జన్మించాడు. భాగ్యలక్ష్మి ఈ నెల 8న రెండో కాన్పు కోసం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మితో పాటు ఆమె కుమారుడు సోమేష్కుమార్, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎదుట గల చెట్టు కింద సేదతీరారు. అప్పటికే ఇద్దరు మహిళలు భాగ్యలక్ష్మితో పాటు ఆమె బంధువులతో పరిచయం పెంచుకున్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత భాగ్యలక్ష్మి తన కుమారుడు సోమేష్కుమార్ను తనకు పరిచయమైన ఇద్దరు మహిళల వద్ద ఉంచి కాన్పుల వార్డుకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి కుమారుడు, ఇద్దరు మహిళలు కనిపించలేదు. దీంతో భాగ్యలక్ష్మి, ఆమె బంధువులు ఆస్పత్రి మొత్తం వెతికినా సోమేష్కుమార్ ఆచూకీ లభించకపోవడంతో నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. భాగ్యలక్ష్మికి ఇంకా రెండో కాన్పు కాలేదు.
నాలుగు బృందాలతో గాలింపు..
నల్లగొండ: బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో నాలుగు టీంలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ తన సిబ్బందితో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు.
ఫ ఆచూకీ కోసం ముమ్మరంగా
గాలిస్తున్న పోలీసులు
భువనగిరిలో కనిపించిన కిడ్నాపర్లు
భువనగిరిటౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిడ్నాప్ అయిన బాలుడితో పాటు ఇద్దరు మహిళలు భువనగిరి బస్టాండ్ ఆవరణలో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వారు బస్టాండ్ నుంచి బయటకు వచ్చి యాదగిరిగుట్ట వైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళలు భువనగిరి బస్టాండ్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పే నంబర్ అధారంగా కిడ్నాప్ అయిన బాలుడితో సహా ఆ ఇద్దరు మహిళలను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలిద్దరు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్, ఆత్మకూర్ మండలాలకు చెందినవారిగా సమాచారం. అయితే కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామనే భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.

నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో బాలుడి కిడ్నాప్