
నీటి కుంటలో పడి బాలుడి మృతి
డిండి: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండలం నగారాదుబ్బతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగారాదుబ్బతండాకు చెందిన కరంటోతు చంద్రు, బుజ్జి దంపతుల కుమారుడు సిద్ధు(13) నాగరకర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అక్కడే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామంలోనే ఉంటున్న సిద్ధు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన నలుగురి స్నేహితులతో కలిసి ిఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని మెట్టన్కుంట వద్దకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో సిద్ధు ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. అతడి స్నేహితులు నలుగురు భయంతో అక్కడి నుంచి చేరుకున్నారు. కానీ సిద్ధు నీటి కుంటలో పడిపోయిన విషయం ఎవరికీ చెప్పలేదు. రాత్రయినా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో సిద్ధు తల్లిదండ్రులు గ్రామంలో ఎక్కడ వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. మంగళవారం తెల్లవారుజామున సిద్ధు వెంట వెళ్లిన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు, తండావాసులు మెట్టన్కుంటలో వెతకగా సిద్ధు మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సిద్ధు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి చంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.