గరిడేపల్లి: బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన లచ్చిమల్ల లక్ష్మయ్య(41) బైక్పై గరిడేపల్లి నుంచి హుజూర్నగర్ వైపు వెళ్తుండగా అప్పన్నపేట గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మయ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
చౌటుప్పల్ రూరల్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పశువులను గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సంతలో కొనుగోలు చేసిన 12 ఎద్దులు, రెండు ఆవులను ఆటోలో హైదరాబాద్లోని బహదూర్పూరాలో గల కబేళాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తునికి చెందిన ఆటో డ్రైవర్ యలమంచిలి అప్పలరాజు, జగ్గంపేటకు చెందిన అవాల నూకరాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
బీబీనగర్: బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన కూనూరు దుర్గాప్రసాద్(20) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం తెల్ల వారుజామున హైదరాబాద్ నుంచి దుర్గాప్రసాద్ కాటేపల్లి గ్రామానికి బైక్పై వస్తుండగా.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వెనుక బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ బైక్ పైనుంచి ఎగిరిపడి ఫ్లైఓవర్ గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బంధువు కూనూరు నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఉరేసుకుని ఆత్మహత్య
మర్రిగూడ: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రా మంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడ గ్రామానికి చెందిన ఐతరాజు సత్తయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఐతరాజు మహేష్(32) మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మహేష్ తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, కుమార్తె ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.

బైక్ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి