
భద్రతా లోపం ఏమీ లేదు
● ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రసాద తయారీ కేంద్రం నుంచి చింతపండు దొంగతనం జరిగిన ఘటనలో ఎస్పీఎఫ్ పోలీసుల భద్రతా లోపం ఏమీ లేదని, ఆలయ పరిసరాల్లో ఎస్పీఎఫ్, హోంగార్డులతో పటిష్ట బందోబస్తు ఉందని ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు అన్నారు. యాదగిరి కొండపైన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి 8.20గంటలకు ఇద్దరు వ్యక్తులు ఓ కారులో వచ్చారని, అర్ధరాత్రి 2గంటల తరువాత కారును శివాలయం సమీపంలోని ప్రసాదం టిక్కెట్ కౌంటర్ సమీపంలో పార్కింగ్ చేశారన్నారు. ఆ సమయంలోనే చింతపండు బస్తాలను కారులో పెట్టారని, ఈ క్రమంలో పెట్రోలింగ్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వెంటనే అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొని విచారించగా చింతపండు దొంగతనం చేసినట్లు తెలిపారన్నారు. దొంగలను పట్టుకున్నది భద్రతా సిబ్బందేనని, ఇందులో భద్రత లోపం ఏమీ లేదన్నారు. సమావేశంలో ఎస్పీఎఫ్ ఎస్ఐ అనిల్, ఏఎస్ఐ మాణిక్ప్రభు ఉన్నారు.
తాటి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
వలిగొండ : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వలిగొండ మండలంలోని వెల్వర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్వర్తికి చెందిన గీత కార్మికుడు కొమ్మగాని వెంకటేశం (48) శుక్రవారం కల్లు గీయటానికి తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పక్క పొలంలోని రైతు ప్రమాదాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి వెళ్లి 108 అంబులెన్స్లో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.

భద్రతా లోపం ఏమీ లేదు