రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

Jun 8 2025 1:21 AM | Updated on Jun 8 2025 1:21 AM

రైతుల

రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

రామన్నపేట: రైతులు పండించిన పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో తొలుత 311 ఎఫ్‌పీఓల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. పీఏసీఎస్‌ల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, స్థానికులు సాధారణ సభ్యత్వం పొందవచ్చు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం ఇతర పంటలను కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖకు అందజేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహించినందుకు ప్రభుత్వం పీఏసీఎస్‌లకు కమీషన్‌ చెల్లిస్తుంది. వీటికి ప్రభుత్వంతో పాటు సహకార బ్యాంకుల నుంచి రుణాలు, రాయితీలు అందుతాయి. వీటి నిర్వహణలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది.

ఎఫ్‌పీఓలతో రైతులకు మరింత మేలు

పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎఫ్‌పీఓలతో రైతులకు మరింత మేలు జరుగనుంది. కంపెనీ చట్టాల పరిధిలోకి వచ్చే ఎఫ్‌పీఓలను సీబీబీఓ(క్లస్టర్‌ బేస్డ్‌ బోర్డ్‌ ఆర్గనైజేషన్‌) హైదరాబాద్‌ కేంద్రంగా పర్యవేక్షిస్తుంది. పీఏసీఎస్‌ల్లోని సభ్యులు అదనంగా రూ.1000 సభ్యత్వ రుసుము చెల్లించి ఎఫ్‌పీఓలలో సభ్యులుగా చేరవచ్చు. వీటిల్లో రైతులు, ఉత్పత్తిదారులకు మాత్రమే సభ్యత్వం ఇవ్వనున్నారు. ప్రతీ సంఘానికి కేంద్ర ప్రభుత్వమే ఈక్విటీ గ్రాంట్‌ క్రింద రూ.15లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6లక్షల చొప్పున మూడేళ్ల పాటు చెల్లిస్తుంది. ప్రస్తుతానికి పీఏసీఎస్‌ల కార్యదర్శినే ఎఫ్‌ఈఓలకు సీఈఓగా వ్యవహరించే అవకాశం ఉంది. అదనంగా ఒక అకౌంటెంట్‌ను నియమిస్తారు. ఎఫ్‌పీఓలు వాణిజ్య సంస్థల సహకారంతో రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. రైతులు పండించిన విభిన్నమైన పంట ఉత్పత్తులకు జాతీయస్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావడానికి, ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఎఫ్‌పీఓలు దోహదపడతాయి. ఎఫ్‌పీఓలలో సభ్యులుగా చేరిన రైతులకు వ్యాపార ప్రణాళిక తయారీ, మార్కెటింగ్‌ అంశాలపై శిక్షణ ఇస్తారు.

రైతులకు చాలా ఉపయోగకరం

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎఫ్‌పీఓలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సహకారశాఖ ఆధ్వర్యంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి మూడు సంస్థలను ఏర్పాటు చేసింది. వాటికి ఎఫ్‌పీఓలను అనుసంధానం చేస్తారు. తద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడం జరుగుతుంది. మార్కెటింగ్‌ బాగా పెరుగుతుంది. అయితే ఎఫ్‌పీఓల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వెలువడలేదు.

– జి. మురళీరమణ, డీసీఓ, యాదాద్రి జిల్లా

పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు

ఫ ఉమ్మడి జిల్లాలో 37 ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం

ఫ రైతులు పండించిన పంట

ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి

ఉమ్మడి జిల్లాలో 37 ఎఫ్‌పీఓలు

ఉమ్మడి జిల్లాలో 131 పీఏసీఎస్‌లు ఉండగా.. 37 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. నల్లగొండ జిల్లాలో శాలిగౌరారం, కట్టంగూర్‌, కేతేపల్లి, నార్కట్‌పల్లి, వెలిమినేడు, గుండ్రాంపల్లి, పెద్దవూర, దేవరకొండ, చండూరు, తిప్పర్తి, దామరచర్ల, గుర్రంపోడు, గొల్లగూడలో, సూర్యాపేట జిల్లాలో నడిగూడెం, చిలుకూరు, సూర్యాపేట, మేళ్లచెరువు, చిల్లేపల్లి(నేరేడుచర్ల), పాలకీడు, చివ్వెంల, నారాయణగూడ, పొనుగోడులో, యాదాద్రి జిల్లాలో గుండాల, చందుపట్ల, రామన్నపేట, సంస్థాన్‌ నారాయణపురం, రాజపేట, తుర్కపల్లి, ఆలేరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, చౌటుప్పల్‌, పోచంపల్లి, బీబీనగర్‌, యాదగిరిగుట్ట, మోత్కూరు, బొమ్మలరామారంలో ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఎఫ్‌పీఓలో గరిష్టంగా 300మంది సభ్యులు గా చేరవచ్చు. ఈ సంఘాల యాజమాన్య బోర్డుల్లో మహిళా రైతులకు ప్రాతినిథ్యం కల్పిస్తారు.

రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం1
1/1

రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement