
ఎర్ర జెండాతోనే అసమానతలు లేని సమాజం
వేములపల్లి: ఎర్ర జెండాతోనే అసమానతలు లేని సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం వేములపల్లి మండల కేంద్రంలో సీపీఐ 7వ మండల మహాసభలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఐ పేద, బడుగు, బలహీనవర్గాలు సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగి ధనికులు మరింత ధనికులుగా, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ మహాసభలో మద్దిరాల రంగారెడ్డి, అంజనపల్లి రామలింగం, శాంతమ్మ, ఉదయ్, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, పుట్టల నాగయ్య, పుట్టల కృష్ణ, వల్లంపట్ల వెంకన్న, మున్నయ్య, సుధాకర్, జయ, సత్యం, పరమేష్, లింగయ్య, ఆనందం తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం