చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer On Game-Changing Moment In IPL 2025 Final | Sakshi
Sakshi News home page

చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్‌ అయ్యర్‌

Jun 4 2025 1:36 PM | Updated on Jun 4 2025 1:36 PM

Shreyas Iyer On Game-Changing Moment In IPL 2025 Final

PC: BCCI/IPL.com

తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాల‌ని కలలు కన్న పంజాబ్ కింగ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్‌-2025 సీజన్‌లో ఆఖరి మొట్టుపై పంజాబ్ బోల్తా పడింది. మంగళవారం అహ్మదాబాద్‌​ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది.

ఆర్సీబీ నిర్ధేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ సేన చేధించలేకపోయింది. లక్ష్య చేధనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్‌(61), జోష్ ఇంగ్లిష్‌​(39) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు.

ఆర్సీబీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్‌​ కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫైన‌ల్లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. ఈ టోర్నీ ఆసాంతం త‌మ కుర్రాళ్లు అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచార‌ని అయ్య‌ర్ కొనియాడాడు.

"ఈ మ్యాచ్‌లో ఓట‌మి మ‌మ్మ‌ల్ని తీవ్ర నిరాశ‌ప‌రిచింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు ఆ సందర్భానికి త‌గ్గ‌ట్టు ఆడారు.  ఈ మ్యాచ్‌లో ఆశించిన ఫ‌లితం మాకు ద‌క్క‌లేదు. కానీ మాకు మ‌ద్ద‌తుగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్‌, ప్ర‌తీ ఒక్క‌రికి క్రెడిట్ ఇవ్వాలి.

మా యాజ‌మాన్యం కూడా చాలా స‌పోర్ట్ చేశారు. మా గ‌త మ్యాచ్ దృష్ట్యా 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌల‌ర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా కృనాల్ తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది.

తన ఎక్స్‌పీరియన్స్‌ను మరోసారి చూపించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మా జట్టులోని చాలా మంది కుర్రాళ్లకు ఇదే తొలి సీజన్‌. అయిప్పటికి వారు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడారు. వారందరికి అభినందనలు. వారు లేకపోయింటే మేము ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. 

మా పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నీలో మాకు చాలా  సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి చాలా అనుభవాన్ని పొందారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని అశిస్తున్నాను. కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో మళ్లీ తిరిగివస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement