
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
భువనగిరిటౌన్ : భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి వాతావరణం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా గురువారం నారాయపురంలో 43.1 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గుండాల 42.8, రామన్నపేట 42.7, చౌటుప్పుల్ 42, బీబీనగర్ 42, మోత్కుర్ 41,7, వలిగొండ 41.5, ఆత్మకూర్, మోటకొండూర్, రాజాపేట 41.5, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, యాదగిరిగుట్ట 41 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
భూదాన్పోచంపల్లి: ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకొన్నామని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ అన్నారు. గురువారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో జూలూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 216 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 214 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అందెల లింగంయాదవ్, మార్కెట్కమిటీ డైరెక్టర్ రేనిగుంట లాలయ్యయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ పెంటయ్య, మాజీ ఎంపీటీసీ చిలుక బుచ్చయ్య, కాంగ్రెస్పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మోటె బాలరాజు, జిల్లా నాయకులు చేగూరి ప్రభాకర్, జడల అంజయ్య, గణేశ్, పర్వతం అశోక్, సీఈఓ రెబ్బాస్ నర్సింహ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చెక్ బౌన్స్ కేసుల
పరిష్కారానికి లోక్ అదాలత్
భువనగిరిటౌన్ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 691 చెక్ బౌన్స్ కేసులను గుర్తించినట్లు, ఈ కేసులలో నోటీసులు కూడా జారీ చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం మే 5 నుంచి 19వ తేదీ వరకు ప్రీ సిట్టింగ్లు నిర్వహించబడుతాయని తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించడానికి భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదాద్రి కోర్టుల న్యాయమూర్తులకు తగిన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
కూంబింగ్ ప్రక్రియను నిలిపివేయాలి
భువనగిరిటౌన్ : ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్ కూంబింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, ఎండీ జహంగీర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కాశపాక మహేష్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రక్రియలో భాగంగా అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు పార్టీ ప్రతిపాదన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు కొనసాగించి అమాయక ఆదివాసీలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, టీపీఎఫ్, డీటీఎఫ్, ఐద్వా నాయకులు ఏశాల అశోక్, కొంమడుగు నర్సింహ, ఎండీ ఇమ్రాన్, బట్టుపల్లి అనురాధ, రాసాల నర్సింహ, దాసరి పాండు, మాయ కృష్ణ, పుట్ట రమేష్, జి.శ్రీనివాసాచారి, లక్ష్మయ్య, వెంకటేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు