పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం

Apr 22 2025 1:54 AM | Updated on Apr 22 2025 1:54 AM

పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం

పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల: పిడుగుపడి పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, లారీ డ్రైవర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం చింతపల్లిలోని కవిత కాటన్‌ ఇండస్ట్రీస్‌ నుంచి 24 టన్నుల పత్తి లోడుతో లారీ బయల్దేరి తమిళనాడు రాష్ట్రం కోవిల్‌పట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్‌ మిల్లుకు వెళ్తోంది. మార్గమధ్యలో రాత్రి 11.30గంటల సమయంలో లారీ నేరేడుచర్లకు రాగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో రహదారి పక్కన పిడుగు పడడంతో నిప్పు రవ్వ ఎగిరి లారీలోని పత్తిపై పడింది. చిల్లేపల్లి వద్దకు రాగానే లారీలోని పత్తి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెనుక నుంచి వస్తున్న వాహనాదారులు మంటలు గమనించి లారీ డ్రైవర్‌ రమేష్‌కు చెప్పడంతో అతడు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగాడు. స్థానికులు నేరేడుచర్ల పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. జేసీబీ సహాయంతో లారీలో నుంచి కొంత పత్తిని తొలగించడంతో మంటలు తగ్గుముఖం పట్టాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది 8గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీతో పాటు అందులోని పత్తి దగ్ధం కావడంతో సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చూశారు.

8గంటలు శ్రమించి మంటలు

ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement