ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి ఉద్యోగుల న్యాయమైన 29 డిమాండ్లతో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యమ కార్యా చరణ వివరాలతో నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ కార్యాచరణను వివరించారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా నాయకులు బి.రాంబాబు, బి.సత్యనారాయణ, ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వర్మ, క్లాస్–4, పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా..
● తొలిరోజు నుంచి ఉద్యోగులు అంతా వారి వాట్సాప్ డీపీ (ప్రొఫైల్ ఫొటోగా) ‘సీఎం సార్, మా డబ్బులు మాకివ్వండి’ అని ఉద్యమ కార్యాచరణ పూర్తి అయ్యే వరకు పెట్టుకుంటామన్నారు.
● 5వ తేదీ వరకూ ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారన్నారు.
● ఈనెల 2 నుంచి 8 వరకూ ప్రతి ఉద్యోగి హ్యాండ్ టూ హ్యాండ్ కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలను సందర్శించి కరపత్రాలను పంపిణీ చేసి ఆందోళనకు దారితీసిన కారణాలను సవివరంగా వివరిస్తామన్నారు.
● ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేస్తామన్నారు.
● 11న జిల్లా కేంద్రాల్లో ఏపీజేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు, ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్న ఇతర సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
● 15 నుంచి 26వ తేదీ వరకూ వర్క్ టూ రూల్ ఉద్యోగులంతా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పని గంటల నిబంధనల మేరకు మాత్రమే విధులు నిర్వహిస్తారన్నారు.
● 15 నుంచి 22వ తేదీ వరకూ ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డీఏ తదితర సమస్యలపై ఫొటోలు, రీల్స్, వీడియోలను వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామన్నారు.
● 15 నుంచి 25వ తేదీ వరకూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు సమర్పిస్తామన్నారు.
● 17న నల్ల కండువాలు ధరించి మానవ హారాలు చేస్తామన్నారు.
● 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల సమీపంలో ప్రధాన డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహిస్తామన్నారు.
● 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాలు చేస్తామన్నారు.
నేటి నుంచి అమరావతి జేఏసీ ఉద్యమం


