పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో కలకలం రేపుతున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడంతో దాని జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది. సోమవారం ఆ ప్రాంతంలో సిగ్నళ్లు లభించకపోవడం, ఎలాంటి ప్రత్యక్ష కదలికలు కనిపించకపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్యలోకి పులి చేరుకుని ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. సిగ్నళ్లు అందనప్పటికీ పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో డ్రోన్ సర్వే నిర్వహిస్తూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రేంజర్ ఎస్కే వలి ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బంది, అవసరమైన వాహనాలతో పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు తీవ్రంగా పర్యవేక్షిస్తున్నారు. పులి జాడ స్పష్టంగా తెలియనందున పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు, సమీప గ్రామాల పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల వైపు వెళ్లకూడదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.


