● మొక్కుబడిగా రెవెన్యూ క్లినిక్ సేవలు
● అందుబాటులో లేని అధికారులు
నూజివీడు: ఈ చిత్రం చూశారా.. ఖాళీ కుర్చీలు.. దాని ముందు టేబుల్.. టేబుల్కు ముందు రెవెన్యూ క్లినిక్ అంటూ బ్యానర్. కేవలం కుర్చీలు, టేబుల్ తప్ప ఒక్క అధికారి గాని, సిబ్బంది గాని లేరు. ఇది నూజివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహంచిన రెవెన్యూ క్లినిక్ తీరు. ప్రతినెలా మొదటి సోమవారం, ఆఖరి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంతో తహసీల్దార్ షంషుద్దీన్ ఏలూరు కలెక్టరేట్కు వెళ్లారు. దీంతో ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న రెవెన్యూ అధికారులే లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లను ప్రతి సోమవారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని చోట్ల నిర్వహిస్తున్నట్లు ఊకదంపుడు ప్రచారం నిర్వహిస్తుందే తప్ప వాస్తవంగా ఏమీ జరగడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శనం. అధికారులెవరూ లేకపోవడంతో తమ సమస్యల గురించి అర్జీ ఇద్దామని వచ్చిన పలువురు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా 14 రకాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రీసర్వే లోపాలు, మ్యుటేషన్లు, వెబ్ల్యాండ్లో తప్పుల సవరణ, హద్దుల వివాదాలు, 22ఏ భూముల తొలగింపు వంటి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం లక్ష్యం. క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారం ఏమాత్రం జరగడం లేదు. ఇచ్చిన సమస్యలపై అర్జీలను పదేపదే ఇస్తున్నారు తప్పితే పరిష్కరిస్తున్న వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్దే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా నిర్వహిస్తారన్నది అర్థమవుతోందని పలువురు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్నారు.


