పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పాత దేవరగుంది గ్రామ సమీపంలోని పీ–రెగ్యులేటర్ టన్నెల్స్ ప్రాంతంలో మళ్లీ పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు, ప్రాజెక్టు కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పులికి అమర్చిన ట్రాకర్ ద్వారా ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. 20 రోజుల క్రితం పోలవరం, బుట్టాయగూడెం మండలాలు దాటి తెలంగాణ సరిహద్దుల వరకు వెళ్లిన ఈ పెద్దపులి, అక్కడి నుంచి వెనక్కి తిరిగి గోదావరి పరీవాహక ప్రాంతమైన కొరుటూరు వద్ద కొద్దిరోజులు సంచరించింది. అనంతరం పాపికొండల అభయారణ్య ప్రాంతం మీదుగా ఉడతపల్లి చేరుకుని, శనివారం రాత్రికి పాత దేవరగుంది ప్రాంతానికి వచ్చినట్టు అటవీ శాఖ అధికారి ఎస్కే వలీ తెలిపారు. కాగా, పులి సంచరించిన ప్రాంతంలో ఒక గేదె దూడపై దాడి చేసి చంపేయగా, మరో గేదెను తీవ్రంగా గాయపరిచింది. పులి సంచరించిన ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలించి ప్రాజెక్టు రోడ్డు వైపునకు రాకుండా రోడ్డు పక్కన గ్రీన్ క్లాత్ ఏర్పాటుచేశారు. రాత్రి సమయంలో కార్మికులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


