రద్దు చేసిన నీట్ పరీక్ష తిరిగి నిర్వహించే సమయంలో విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయకూడదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు లేదా స్థానిక పరీక్షా కేంద్రాలను కేటాయించాలి. ప్రతి ఏటా పేపర్ లీకేజీలు జరగకుండా శాశ్వత చట్టపరమైన పరిష్కారం చూపాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రీకృత పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి.
– పాతినవలస రాజేష్,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలలో 20 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు. ఈ రోజు పేపర్ లీకుతో పరీక్ష రద్దు చేయడం విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. చాలామంది విద్యార్థులు బాగా చదువుకొని నీట్ ప్రవేశ పరీక్షలో సీటు కొట్టాలన్న ఆశతో పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ చేయడంతో విద్యార్థుల జీవితాలు తీవ్రంగా నష్టపోతాయి.
– డి.శివకుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
దేశంలో విద్యా మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలి. పేపర్ లీకేజ్కు కారణమైన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇది కేవలం లీకేజీ ఘటన కాదు, నిజాయితీగా చదివే విద్యార్థుల ఆశలు, కలలను హత్య చేసే నేరం. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులు, మధ్యవర్తులు, మాఫియా గ్యాంగులు, రాజకీయ సంబంధాలు ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేయాలి.
– కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు


