బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిలి మండలాల్లో భూసేకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివాసీ సేనా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులు కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో జరుగుతున్న భూసేకరణ భూటకపు భూసేకరణ అని విమర్శించారు. భూసేకరణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనులకు పట్టాలు ఉన్న భూములు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములను సేకరించి గిరిజనేతరుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణలో బ్రోకర్ల హావా నడుస్తుందని తీవ్రంగా విమర్శించారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాధాకృష్ణ మాట్లాడుతూ భూసేకరణ ఎంతో పారదర్శకంగా చేసినట్లు, భూములకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్న వారికి పూర్తి న్యాయం చేస్తున్నామని తెలిపారు.


