ఏలూరు (టూటౌన్): సేవల్లో లోపంపై శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చునని ఛైర్ పర్సన్ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శాశ్వత లోక్ అదాలత్ పురోగతి, నిర్వహణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేస్ కుమారి మాట్లాడుతూ రవాణా, పోస్టల్, విద్యుత్ సానిటేషన్, హాస్పిటల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఎన్ఆర్ఈజీఎస్, విద్య, హౌసింగ్, రియల్ ఎస్టేట్ విభాగాలలో సర్వీసు లోపంపై శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చని సూచించారు.
జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. పొణంకి సత్యపవన్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేష్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు, రాఘవా చార్యులు ఉదయం నుంచి నిత్య హోమం తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కల్యాణం మండపంలో లోక కల్యాణర్థం శ్రీ శ్రీదేవి భూదేవి సమెత శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం వైఖానస ఆగమొక్తంగా నిర్వహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనం సేవ ఆలయ తిరువిధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గరుడ వాహన సేవ జంగారెడ్డిగూడెం వీధుల్లో నిర్వహిస్తామని తెలిపారు.


