తణుకు అర్బన్: బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి స్టేట్ లెజిస్లేటివ్ లీడర్షిప్ వర్క్షాపులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీలో పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది హాజరైన ఈ సదస్సులో.. విద్యా విధానంలో మార్పులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని సమస్యలు, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు.
భీమవరం: ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, దీనిపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,800 నగదు, 50 ఏళ్లకే పెన్షన్లు వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో సంచుల కొరతతో రైతులు, రక్షణ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా పదవులు పొందిన నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యల పట్ల స్పందించడంలో అలసత్వం ప్రదర్శించకూడదని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
భీమవరం: విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, మానవతా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చన్నారు. సంస్థ నిర్వాహకుడు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. 23 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రూ.44 వేల నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సంస్థ ప్రతినిధులు రామ్మోహనవర్మ, వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.


