● ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన
● తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న ఉణుదుర్రు ఇళ్ల బాధితులు
ఉండి: ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన బాధితులు సోమవారం ఉండిలో తహసీల్దార్ కార్యాలయాన్ని సీపీఎం నాయకులతో సంయుక్తంగా ముట్టడించి తమ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కే నాగార్జునకు వినతిపపత్రం అందించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. 70 ఏళ్లనుంచి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉణుదుర్రులో ఆలకోడులో నివాసముంటున్నామని, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రేరేపణలతో తమను అన్యాయంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారని వాపోయారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తమను ఇప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలని బోరున విలపించారు. ఇళ్లు ఖాళీ చేయట్లేదని మాకు వారంరోజులుగా మంచినీటి సరఫరాను నిలిపివేశారని బాధితులు ఆరోపించారు. ఎవరి సంతోషం కోసమో తమ జీవితాలు నాశనం చేయవద్దని మొర పెట్టుకున్నారు. ముందుగా మాకు నివాసయోగ్యమైన స్థలాలు చూపించాలని అక్కడ ఇళ్ళు కట్టుకునేందుకు సహకరించాలని బాధితులు కోరారు.


