నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎస్.నిఖిలేశ్వరరావు, సాయి మణికంఠ ఈశ్వర్ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ చూపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మార్గదర్శకత్వంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆటో–అడ్జుడికేషన్ హ్యాకథాన్ షోకేస్ 2026 లో ‘డాక్యుమెంట్ ఫోర్జరీ/డీప్ ఫేక్ డిటెక్షన్’ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3 లక్షల బహుమతిని కై వసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల నుంచి యువ ఆవిష్కర్తలు 3,500 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా జరిగింది. తుది దశకు ఎంపికై న కొద్ది బృందాలలో నూజివీడు ట్రిపుల్ ఐటీ బృందం నిలిచి, తన వినూత్న ఆలోచనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. టీమ్ రూపొందించిన ఫోరెన్సిక్ ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్.. ఆరోగ్య బీమా క్లెయిమ్ల పరిశీలనలో ఉపయోగించే డాక్యుమెంట్లలో ఉండే ఫోర్జరీలు, మార్పులు, డీప్ఫేక్ ఆధారిత మోసాలను గుర్తించేందుకు సహాయ పడుతుంది. శ్రీఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన్ఙ పథకంలో క్లెయిమ్ల ఆటో అడ్జుడికేషన్ ప్రక్రియలో ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది. తక్కువ కంప్యూటింగ్ వనరులతో అధిక ఖచ్చితత్వంతో మోసాలను గుర్తించే విధానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ ఘనతకు గుర్తింపుగా టీంకు రూ.3 లక్షల నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో డిజిటల్ మోసాలను తగ్గించే దిశగా తమ పరిశోధన కొనసాగుతుందని, సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పరిశోధనా పరమైన ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలే ఈ విజయానికి ప్రధాన కారణమని, పరిమిత వనరులతో కూడా నాణ్యమైన పరిశోధన చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు.
డీప్ ఫేక్ డిటెక్షన్ విభాగంలో రన్నరప్


