చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. షేక్ మదర్ సాహెబ్, హుస్సేన్ బి దంపతుల కుమార్తెలు షేక్ రిబ్కా, షేక్ కేజీయలు తమ కీబోర్డ్ ప్లేయింగ్ నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు. గత ఫిబ్రవరిలో గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన భారీ సామూహిక కీబోర్డ్ ప్లే కార్యక్రమంలో భారత్, అమెరికా, బ్రిటన్ సహా 22 దేశాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్నారు. కఠినమైన నిబంధనల మధ్య జరిగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన 777 మంది విజేతలలో ఈ అక్కాచెల్లెళ్లు చోటు దక్కించుకున్నారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తితో క్రమశిక్షణగా శిక్షణ పొందిన వీరు, శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను అందుకున్నారు.


